ప్రజల డబ్బుతో వాలంటీర్లను నియమించింది వైసీపీ నేతలకు వంగివంగి దండాలు పెట్టడానికా?: చంద్రబాబు

  • రూ. 1,000 కరోనా సాయం వైసీపీ నేతలే ఇస్తామనడం ఏంటి?
  • ఒప్పుకోని వాలంటీర్లను విధుల్లోంచి ఎలా తొలగిస్తారు
  • వాళ్లు ఉన్నది ప్రజల కోసమా? పార్టీ కోసమా?
  • వాలంటీర్ ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బాబు
ఏపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాట వినని వాలంటీర్లను వేధింపులకు గురి చేస్తూ, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. వేధింపులు తట్టుకోలేక విజయనగరం జిల్లాలో ఓ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేయడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కరోనా సాయం కింద ప్రజలకు అందిస్తున్న వెయ్యి రూపాయల సాయాన్ని వైసీపీ నేతలే ఇస్తామని ఎలా చెబుతారన్నారు. దీనికి ఒప్పుకోని వాలంటీర్లను విధుల్లోంచి తొలగించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ఉన్నది ప్రజల కోసమా? పార్టీ కోసమా? అని ప్రశ్నించారు.

‘ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడానికే అని చెప్పి వాలంటీర్లను పెట్టుకున్నారు. ప్రజాధనంతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. అలాంటప్పుడు కరోనా సాయం కింద ఇచ్చే 1,000 రూపాయలను వైసీపీ నేతలు ఇస్తామనడం ఏంటి?  కాదన్న వాలంటీర్లను విధుల్లోంచి తొలగించడం ఏంటి? వాళ్ళున్నది ప్రజల కోసమా? పార్టీ కోసమా?. విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలం, గెడ్డతిరువాడకు చెందిన బొంగు కార్తీక్, గోపిశెట్టి ఝాన్సీలను వైసీపీ నేతల మాట వినలేదని విధుల్లోంచి తొలగించారు. ఝాన్సీ ఆత్మహత్యా యత్నం చేసింది. ఏమిటీ వేధింపులు? ప్రజల డబ్బుతో వాలంటీర్లను నియమించింది వైసీపీ నేతలకు వంగివంగి దండాలు పెట్టడానికా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

Chandrababu
question
govt
YSRCP
leaders
volunteers

More Telugu News